Friday 30 December 2016

దేశసంపదను భక్షిస్తున్న ఎలుకను పట్టాల్సిందే అందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీ స్పష్టీకరణ మూడేళ్ల క్రితం కుంభకోణాలతో నష్టంపైనే చర్చంతా ఎంత తిరిగొచ్చిందన్నదే ఇప్పుడు ప్రజల్లో ముచ్చట అని వెల్లడి ఆధార్‌ అనుసంధానిత చెల్లింపులకు ‘భీమ్‌’ యాప్‌ ప్రారంభం

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ దుయ్యబట్టారు. దేశ సంపదను భక్షిస్తున్న ఎలుకను పట్టుకునేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం పత్రికల నిండా బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం వంటి వాటి కారణంగా ఎంత మొత్తం నష్టం వాటిల్లిందన్నదాని గురించే కథనాలుండేవని, ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో ఎంత మొత్తం జమయిందన్నదానిపై ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారని అన్నారు. డిజిటల్‌ నగదు ఉద్యమ విజయోత్సవ కార్యక్రమం డిజిధన్‌ మేళాలో శుక్రవారం ప్రధాని పాల్గొని ప్రసంగించారు. వేలి ముద్ర ఆధారంగా ఆధార్‌ అనుసంధాన,ంతో చెల్లింపులకు వీలు కలిగించే కొత్త యాప్‌ ‘భీమ్‌’(BHIM-Bharat Interface for Money)ను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. పేదలు, అణగారిన వర్గాల ఉన్నతికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ చేసిన కృషికి గుర్తింపుగా ఆయన పేరును ఈ యాప్‌నకు పెట్టారు. ప్రస్తుతం ఈ యాప్‌ భద్రతాంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, రెండు వారాల్లో దేశవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని వెల్లడించారు.
ఆశావాదులకు వేల అవకాశాలు
‘‘కొంత మంది నిరాశావాదులు. వారు తమ దైనందిన జీవితాన్ని నిరాశావాదంతో ప్రారంభిస్తారు. నిరాశావాదికి నా వద్ద మందు లేదు. కానీ ఆశావాదులకు నా వద్ద వేల అవకాశాలున్నాయి.’’ అని ప్రధాని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సాధించిందేమీ లేదని, కొండను తవ్వి ఎలుకను పట్టారని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యపై చురకలు వేస్తూ ‘‘పేదల సంపదను భక్షిస్తున్నందున నేను ఎలుకను బయటకు రప్పించాలనుకున్నాను. దీనిపై మేము వేగిరంగా పని చేస్తున్నాం.’’ అని అన్నారు. ‘‘మూడేళ్ల క్రితం కుంభకోణాల్లో ఎంత నష్టం వాటిల్లిందన్నదే వార్తల ప్రధానాంశంగా ఉండేది. ఇప్పుడు వాపసు ఎంత వస్తున్నదానిపైనే చర్చంతా. ఇదీ తేడా.’’ అని ప్రధాని అన్నారు.
అవినీతి, నల్లధనం సమస్యను ఎదుర్కోవడానికి ప్రజలు కష్టపడి పని చేయడం వల్లే 86శాతం నగదును మార్చగల్గామని చెప్పారు. ‘‘ప్రజలు చూపించిన ఈ శక్తి సామాన్యమైనది కాదు. ఈ శక్తి దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది.’’ అని అన్నారు. పేదలకు దేశ వనరులు, సంపదపై అధికారం ఉందన్నారు. ‘‘ఈ యాప్‌ ద్వారా భారతరత్న భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ పేరు భారత ఆర్థికవ్యవస్థలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తుంది.’’ అని ప్రధాని చెప్పారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న భారత్‌.. ఎన్నికల్లో ఈవీఎంలను ఎలా ఉపయోగిస్తుందని ప్రపంచం ఆశ్యర్యపోయిందని ప్రధాని గుర్తు చేశారు. ‘‘భారత్‌ యువ దేశం. 65శాతం మంది వయస్సు 35 సంవత్సరాల లోపే. వారంతా డిజిటల్‌ లావాదేవీలకు మళ్లితే అది చరిత్రాత్మకమే అవుతుంది. భారత్‌ ముఖచిత్రమే మారిపోతుంది. భీమ్‌ యాప్‌.. పేదలు, దళితులు, రైతులు, గిరిజనులకు సాధికారికతను కల్పిస్తుంది.’’ అని చెప్పారు. ప్రభుత్వం 100 కోట్లకు పైగా ఆధార్‌ సంఖ్యలను జారీ చేసిందని, వందకోట్లకు పైగా మొబైల్‌ ఫోన్లు దేశంలో ఉన్నాయని, ఒకసారి దేశం డిజిటల్‌లోకి మారితే చరిత్రను సృష్టిస్తుందని ప్రధాని అన్నారు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి రోజుకు కనీసం ఐదు డిజిటల్‌ లావాదేవీలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భీమ్‌ యాప్‌ను ఉపయోగించి ప్రధాని మోదీ ఖాదీ గ్రామోద్యోగ్‌ నుంచి కశ్మీరీ శాలువా, రుమాలు కొన్నారు.

No comments:

Post a Comment