Friday 30 December 2016


60 లక్షల మంది రూ. 7 లక్షల కోట్లు జమచేశారు
సమాచారాన్ని పరిశీలిస్తున్నాం
పన్ను ఎగవేసినట్లు తేలితే చర్యలు తప్పవు: అధికారుల హెచ్చరిక
దిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెలువరించిన నవంబరు 8 తర్వాత పాత నోట్లలో పెద్ద మొత్తాలను 60లక్షల మంది వ్యక్తులు, సంస్థలు జమ చేసినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మొత్తం రూ.7లక్షల కోట్లని, ఇది ఆశ్చర్యకరమైన మొత్తమని పేర్కొన్నారు. నిఖార్సయిన డిపాజిటర్లకు ఎటువంటి వేధింపులూ ఉండవని, అదే సమయంలో నల్లకుబేరులు పన్ను ఎగవేసినట్లు తేలితే విచారణ ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. రూ.2లక్షలు, రూ.5లక్షల కన్నా ఎక్కువగా ఉండే డిపాజిట్లపై తాము రోజువారీ సమాచారం తెప్పించుకుంటున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తికి సంబంధించి ఈ సమాచారాన్ని, గత సమాచారంతో పోల్చి చూసుకుంటున్నామన్నారు. ‘‘రూ.2లక్షలకన్నా ఎక్కువగా జమ అయిన మొత్తాలను చూస్తే మా వద్ద 60లక్షల మంది వ్యక్తులు, సంస్థల సమాచారం మా వద్ద ఉంది. ఈ వ్యక్తులు, సంస్థలు జమ చేసిన మొత్తం విలువ రూ.7లక్షల కోట్లు. ఇది ఆశ్చర్యకరమైన మొత్తం. ఈ మొత్తాలను పరిశీలిస్తున్నాం. పెద్ద మొత్తాల్లో జమ చేసిన వ్యక్తుల వరకు చూసుకుంటే ఆ మొత్తం రూ.3లక్షల కోట్ల నుంచి రూ.4లక్షల కోట్ల వరకు ఉంది. పన్ను వసూలుకు ఇప్పుడు పెద్ద ఎత్తున అవకాశం ఉంది. బ్యాంకులో వేసినంత మాత్రాన నల్లధనం తెల్లధనంగా మారదు. అటువంటి వారు ముందుకొచ్చి ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో పాల్గొంటారని ఆశిస్తున్నాం. వారు స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే భవిష్యత్తులో సంతోషంగా ఉండబోరు.’’ అని ఒక అధికారి చెప్పారు.

No comments:

Post a Comment