Tuesday 29 November 2016

మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు పుట్టినిల్లు..., పవిత్ర హిమాలయాలు..! ఎందరో యోగులు, మునులు, రుషులు ఇప్పటికీ కూడా హిమాలయాల్లో సంచరిస్తారని చెబుతారు. అంతేకాదు ఈ




హిమగిరుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిశాయి. మనిషీ ఎంత అభివృద్ధి సాధించినా కూడా ఈ ప్రకృతికి నిబద్ధుడై ఉండాల్సిందే. ఈ పరమ సత్యాన్ని ప్రాచీన భారతీయ రుషులు ఎప్పుడో గ్రహించారు. అందుకే ప్రకృతికీ-మనిషీకి మధ్య బంధాన్ని వీడదీయలేనంతగా పెనవేశారు.




హిమవన్నగాల చెంత ఉన్న రాష్ర్టం ఉత్తరాఖండ్. ఈ రాష్ర్టంలోని నాలుగు దివ్యస్థలాన్ని చార్ ధామ్ గా వ్యవరిస్తారు.యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ క్షేత్రాల దర్శన సమాహారాన్ని చార్ధామ్ యాత్రగా పరిగణిస్తారు. ఇవి పూర్తిగా హిమలయాల్లోనే వెలిసిన పుణ్యధామాలు..! 





చార్ధామ్ క్షేత్రాల యాత్రకు హరిద్వార్ను ముఖద్వారంగా భావిస్తారు. భగీరథ యత్నానికి తలవంచి, చండప్రచండమైన వేగంతో, గంగ శివుడి జటాఝూటంలోకి దూకింది.




 ఆ గంగ హిమ పర్వతాల నుంచి జనావాసాల్లోకి వచ్చింది హరిద్వార్లోనే! ఇక్కడ నీల పర్వతంపై నెలకొన్న చాందీదేవి, బిల్వ పర్వతంపై ఉన్న మానసాదేవి ఆలయాల్ని భక్తులు సందర్శిస్తారు.

అటు హరిద్వార్ నుంచి రిషికేశ్కు భక్తులు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన హాలాహలాన్ని మహాదేవుడు సేవించిన ప్రదేశంగా వ్యవహరించే నీలకంఠ మహాదేవాలయాన్ని దర్శిస్తారు. ఇక్కడే ఉన్న రామ్, లక్ష్మణ్ ఝూలాలు, వసిష్ఠ గుహ, భరత్ మందిరాల్ని తిలకిస్తారు.

చార్ధామ్ యాత్రలో మొదటి క్షేత్రమైన యమునోత్రికి డెహ్రాడూన్, ముస్సోరీల మీదుగా భక్తులు పయనమవుతారు. యమునా నది పర్వతాగ్రాల నుంచి కిందకు 





దిగిన ప్రదేశం యమునోత్రి. హనుమాన్ చట్టి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి కాలినడకన లేదా గుర్రాల మీద భక్తులు వెళ్తారు. సముద్రమట్టానికి 3,165 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో యమునాదేవి ఆలయం గోచరమవుతుంది. కిలోమీటరు దూరంలో ఉన్న భారీ పర్వతాన్ని అధిరోహిస్తే యమున జన్మస్థలి దర్శనమిస్తుంది.



దేవతల్లో విష్ణువు.., సరోవరాల్లో సాగరం.., నదుల్లో గంగ.., పర్వతాల్లో హిమాలయం, భక్తుల్లో నారదుడు, గోవుల్లో కామధేనువు, పురాల్లో కైలాసం, క్షేత్రాల్లో కేదారం నాకు పరమ ప్రియమైనవి’- అని స్వయంగా పరమశివుడే పేర్కొన్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. వీటిల్లో విష్ణుధామమైన బదరీనాథ్ తోపాటు, గంగ, కైలాస పర్వతం, కేదార క్షేత్రం అన్ని కూడా హిమాలయాల్లోనే ఉన్నాయి. సృష్టి ప్రారంభం నుంచే పరమ శివుడు...హిమాలయాలలోని క్షేత్రాల్లో నివసిస్తున్నాడని పురాణాలు 






చెబుతున్నాయి.అలాగే పాండవులు స్వర్గారోహణం చేసింది కూడా పవిత్ర హిమగిరుల్లోనే..! ఇంకా జగద్గురువు ఆది శంకరాచర్యాలు కైవల్యం పొందింది కూడా ఈ గిరుల్లోనేనని చెబుతారు.

చార్ ధామ్ యాత్రలో భాగంగా..యమునోత్రిని దర్శిచిన భక్తులు...ఇక్కడ నుంచి ఉత్తరకాశి మీదుగా గంగనాని, ధూలి ప్రాంతాల్ని సందర్శించి...ఆ తర్వాతే గంగోత్రికి చేరుకుంటారు. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఈ ప్రదేశం ఉంటుంది. భగీరథుడి తపోఫలితంగా గంగాదేవి నదీరూపంలో భూమిపై అడుగిడిన చోటుగా భావించే స్థలంలో పవిత్రమైన శిల ఉంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ శిలాకృతిని శివలింగంగా భక్తులు పూజిస్తారు. గంగమ్మ దూకుడును తట్టుకుని తన జటాఝూటంలో బంధించేందుకు శివుడే ఇక్కడ కూర్చున్నాడని స్థల పురాణం.




గంగోత్రిలో మంచు కారణంగా ఏటా ఆరు నెలల పాటు మూసి ఉండే గంగా మాత ఆలయాన్ని, అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు తెరుస్తారు. ఈ ఆలయానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముఖ్ను గంగానది జన్మస్థలిగా భావిస్తారు. ఇక్కడ భాగీరథి ప్రవహిస్తుంది.



 ఇది దేవప్రయాగ దగ్గర అలకానంద నదితో సంగమమై గంగానదిగా మారుతుంది. గంగోత్రి నుంచి శ్రీనగర్, రుద్రప్రయాగ, గౌరీకుండ్ మీదుగా భక్తులు మూడో దివ్యధామమైన కేదార్నాథ్కి చేరుకుంటారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. హరుడు, కేదారేశ్వరుడిగా వెలసిన ఈ క్షేత్ర వైభవం స్కాంద పురాణంలో ఉంది.

చార్ధామ్ యాత్రలో నాలుగో దివ్యస్థలి బదరీనాథ్. హిమాలయాల్లోని నీలకంఠ పర్వతాల నేపథ్యంలో నర, నారాయణ కొండల నడుమ, అలకానంద నదీ తీరాన విష్ణు రూప బదరీనాథుడు




 కొలువుతీరి ఉంటాడు. ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. గర్భాలయంలో ధ్యానముద్రాంకితుడైన శ్రీహరి విగ్రహం గోచరమవుతుంది. ప్రధాన ఆలయంతోపాటు ఆదిబద్రి, యోగధ్యాన్ బద్రి, బృధా బద్రి, భవిష్య బద్రి పేరిట మరో నాలుగు ఆలయాలు ఉంటాయి. ఇక్కడ పంచ ప్రయాగలుగా పేర్కొనే దేవ, రుద్ర, నంద, కర్ణ, విష్ణుప్రయాగలు దర్శనీయ ప్రదేశాలు.





మన భారతదేశం.... ‘నమోనమామి’ అంటూ ఆరాధించదగిన కర్మభూమి, పుణ్యభూమి! ఆసేతు హిమాచలం వరకు ఎన్నో దివ్యసన్నిధులు ధామాలు, క్షేత్రాలు ఇక్కడ నెలకొన్నాయి. హిమాలయాల్లోని ఈ మహనీయ స్థలాల్ని శ్రద్ధతో, భక్తితో, విశ్వాసాలతో దివ్య, భవ్య, ఆధ్యాత్మిక పెన్నిధులుగా సేవించాలి. అప్పుడే యాత్ర సిద్ధి, చిత్తశుద్ధి, అలౌకికమైన ఆత్మానంద లబ్ధి చేకూరుతాయి.




షేర్ చేయండి share this

No comments:

Post a Comment